కరోనా వైరస్ ప్రభావం మొదలైన పది నెలల నుంచి ప్రపంచ దేశాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ పరిశోధనలు వివరిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా కరోనా వైరస్పై ఒక కీలకమైన పరిశోధన చేశారు. విటమిన్ డి ద్వారా కరోనా వైరస్ తీవ్రతను తగ్గించవచ్చని బోస్టన్ పరిశోధకులు తేల్చారు. కరోనా వైరస్ను జయించాలంటే శరీరంలో విటమిన్ డి సరైన మోతాదులో ఉండాలని పరిశోధకులు చెప్పారు.
విటమిన్ డి సరిగ్గా ఉంటే కరోనా బారిన పడినా ఆరోగ్యం క్షీణించదని, కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం రాదని తెలిపారు. విటమిన్ డి సరిగ్గా ఉండి కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య చాలా తక్కువ అని పరిశోధకులు గుర్తించారు. ఇదే సమయంలో విటమిన్ డి తక్కువగా ఉన్న వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు. కేవలం బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులే కాదు ఇటీవల స్పెయిన్లో జరిగిన ఓ పరిశోధనలోనూ కరోనా రోగులకు సమృద్ధిగా విటమిన్ డి ఉంటే ప్రాణాపాయం ఉండదని తేల్చారు.
ఈ నేపథ్యంలో విటమిన్ మన శరీరంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన పట్టణాలు, నగరాల్లో సుమారు 80 శాతం మంది విటమిన్ డి లోపంతో ఉన్నారని ఒక అంచనా ఉంది. శరీరంలో విటమిన్-డి తగినంత స్థాయిలో లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఒళ్లు నొప్పులు, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో విటమిన్ డి లోపం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం కోవిడ్ -19తో పోరాటంలోనూ ఇదే కీలకం.
రోజూ విటమిన్-డి డోస్ తీసుకునే వాళ్లలో కోవిడ్ వైరస్తో చనిపోయే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుందని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. రక్తంలో ఉండే ఇమ్యూన్ సెల్స్తో విటమిన్ కు లింక్ ఉంటుందని వారు గుర్తించారు. శరీరంలో ఉండే సైటోకైన్ స్టార్మ్ ప్రభావం ఇమ్యూన్ సిస్టమ్ (రోగనిరోధక వ్యవస్థ) పై పడుతుంది. తద్వారా ఎక్కువ సంఖ్యలో ప్రొటీన్లు రక్తంలోకి త్వరితగతిన విడుదలై ప్రొటీన్ల లెవల్స్ ను తారుమారు చేస్తుందని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు తమ పరిశోధనలో తెలిపారు.
విటమిన్-డి లోపం ఉన్నవారికి ఎముకల బలహీనం, తలనొప్పి, జత్తు రాలిపోవడం, కండరాల నొప్పులు తలెత్తుతాయి. ఈ స్టడీలో బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు 235 మంది పేషెంట్లు బ్లడ్ శాంపుల్స్ పరిశీలించి విటమిన్-డి ను కాలిక్యులేట్ చేశారు. క్లినికల్ రిజల్ట్స్లో శ్వాస సంబంధిత సమస్యలు, స్పృహ కోల్పోవడం, చనిపోవడం వంటివాటిని గుర్తించారు. 40ఏళ్లకు పైగా వయస్సున్న వారిలో విటమిన్ డి లెవల్స్ కనీసం 30నానోగ్రామ్స్/మిల్లీలీటర్ ఉండాలి. అంటే 51శాతం కంటే ఎక్కువగా లేకపోతే విటమిన్ డి లోపంతో చనిపోతున్నారు.
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ద్వారా శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. ఉదయం పూట కనీసం 15 నిమిషాలు ఎండలో ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కొవ్వు ఉన్న చేపలు, కోడి గుడ్డు, పాలు, పుట్టగొడుగులు, పన్నీర్, జున్ను, వెన్న వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి. ఇంజక్షన్లు, మాత్రలు, సిరప్, పొడి రూపంలోనూ విటమిన్ డిని తీసుకోవచ్చు. వైద్యుల సూచన మేరకే వీటిని వాడడం మంచిది. కేవలం కరోనా కోసమనే కాకుండా విటమిన్ డి సమృద్ధిగా ఉండటం మన ఆరోగ్యాలకు మంచిది. కాబట్టి, విటమిన్ డి తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.