బుల్లితెర నటి చిత్ర(28) మరణం పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఆమె కేసులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిత్ర ఇటీవలే హేమనాథ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ అక్టోబర్ 19న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా వెల్లడైంది. అంతే కాదు చిత్ర ప్రతి రోజు తిరువాన్మియూరులోని తన ఇంటి నుంచి షూటింగ్ కు వెళ్ళేది కానీ గత నాలుగు రోజులుగా భర్త హేమనాథ్ తో కలిసి హోటల్ రూమ్ లో ఉంటుంది.
చిత్రది ఆత్మహత్యే అని వైద్యుల బృందం తేల్చారు. అయితే ఆమె ముఖం పై, భుజంపై గాయాలు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. చిత్ర ఆత్మహత్య చేసుకున్న రోజే ఆ హోటల్ కు ఒక రాజకీయ నేత వచ్చి వెళ్లడం కలకలం రేపుతోంది. అది ఆత్మహత్యే అయినా ఆమె మరణం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో మిస్టరీని తేల్చేందుకు చిత్ర స్నేహితులు, పాండియన్ స్టోర్స్ యూనిట్ ను కూడా విచారించాలని నిర్ణయించుకున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా చిత్ర తల్లి కూతురి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. చిత్రతో నిశ్చితార్థం అయ్యేదాకా హేమనాథ్ మంచిగానే ఉన్నాడని ఆ తర్వాతే తన నిజస్వరూపం బయటపెట్టాడని ఆమె పేర్కొన్నారు. తన కూతురిని హేమనాథ్ కొట్టి చంపాడని ఆమె ఆరోపిస్తున్నారు.
అయితే పాండియన్ స్టోర్స్ టీవీ షో ద్వారా లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న చిత్ర మరణానికి ఆ టీవీ షోనే కారణమైందని అంటున్నారు. ఆ షోలో చిత్ర నటించిన కొన్ని సన్నివేశాలకు సంబంధించి, షూటింగ్ నుంచి ఆలస్యంగా రావడం పై హేమనాథ్ కు చిత్రకు మధ్య వివాదం జరిగేదని సమాచారం. ఈ కేసులో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. కాగా చెన్నైలోని బీసెంట్ రోడ్డు స్మశాన వాటికలో పోస్టుమార్టం అనంతరం గురువారం చిత్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కేసులో ఆమె భర్త హేమనాథ్ ను పోలీసులు విచారిస్తున్నారు.