కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ముందుకొచ్చింది. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే వరకు ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సహాయంతో పాటుగా ప్రతి నెలా 25 కేజీల బియ్యం పంపిణీ చేయనుంది. ఈమేరకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు ఉపాధ్యాయులంతా ఈ నెల 15 లోపు తమ వివరాలను వారు పనిచేస్తున్న పాఠశాలల్లో అందించాల్సి ఉంటుంది.
అందుకోసం పాఠశాలలు నిర్దేశించే ప్రొఫార్మాలో వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ఈ జాబితాను పాఠశాల హెచ్ఎం తయారు చేయవలసి ఉంటుంది.
ప్రొఫార్మా -ఏ లో టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించిన వివరాలు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, స్థానిక రేషన్ షాపు వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ప్రొఫార్మా -బీలో పాఠశాలలకు సంబందించిన వివరాలు ఇవ్వాలి. పాఠశాల పేరు, విద్యార్థుల సంఖ్య, అడ్రస్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను తెలియజేయాలి.
పాఠశాలలు ఈ వివరాలను ఎంఈవో, డీఈవోలకు ఈ నెల 10 నుంచి 15 లోపు సమర్పించాల్సి ఉంటుంది.
వీటిని ఏప్రిల్ 16వ తేదీన జిల్లా కలెక్టర్ పరిశీలిస్తారు. 17-19 తేదీలలో రాష్ట్ర స్థాయిలో ఈ డేటాను పరిశిలిస్తారు.
అనంతరం ఏప్రిల్ 20-24 తేదీలలో ఉపాధ్యాయుల ఖాతాల్లో డబ్బును జమ చేస్తారు.
21-25 తేదీలలో స్థానిక రేషన్ షాపుల ద్వారా 25 కేజీల సన్న బియ్యాన్ని అందిస్తారు.
ఏదైనా ఒక ఉపాధ్యాయుడు ఒకటికి మించి పాఠశాలలో పని చేస్తున్నట్లైతే ఏదైనా ఒక్క పాఠశాల ద్వారా మాత్రమే తమ పేరును నమోదు చేసుకోవలసి ఉంటుంది.
ఒక వేళ దంపతులిద్దరూ ప్రైవేటు ఉపాధ్యాయులైతే ఇద్దరికీ రూ. 2 వేల రూపాయలను చెల్లిస్తారు.
గుర్తింపు పొందని పాఠశాలలలో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను కూడా సేకరిస్తారు. అయితే వీరికి ఆర్థిక సహాయం అందించే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.