సిల్వర్ స్క్రీన్ ను తన మాస్ వాయిస్ తో ఊపేస్తోంది సింగర్ మంగ్లీ. టాలీవుడ్ లో ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా మారిన పాటలన్నీ దాదాపు మంగ్లీ పాడినవే. ఇప్పుడు సారంగా దరియా పాటతో మంగ్లీ పేరు మరోసారి మార్మోగుతుంది. ఒకవైపు సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూనే మరవైపు బుల్లి తెరపై కూడా తన మార్కును చూపుతుంది. ఇదిలా ఉంటె ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా మంగ్లీకి మంచి ఆదరణ లభిస్తుంది.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారానికి మంగ్లీని రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తుంది. అయితే మనదగ్గర కాదులెండి. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా మస్కి అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది.. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రతాప్ గౌడ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మంగ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించనుంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి మంగ్లీ పాడిన పాటలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. దీంతో కర్ణాటక బీజేపీ నేతల చూపు ఇప్పుడు ఈ జానపద సింగర్ పై పడింది. ఈ నియోజకవర్గం లో తెలుగువారు ఎక్కువగా ఉండటంతో మంగ్లీ తో ప్రచారం తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తుంది. ఇటీవల ‘రాబర్ట్’ అనే కన్నడ సినిమా ద్వారా కర్ణాటకలో కూడా మంగ్లీకి గుర్తింపు లభించింది. తనకున్న గుర్తింపుతో బీజేపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది మంగ్లీ. తన పాటలు, మాటలతో పార్టీ నేతల్లో ఉత్సాహం నింపనుంది.