ఎక్కడైనా హిందువులు వేరే మతాల్లోకి మారుతుండటం చూస్తుంటాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కేరళ రాష్ట్రంలో తాజాగా బయటపడిన లెక్కలు షాకిస్తున్నాయి. కేరళ లో ఏ పౌరుడైన వేరే మతాన్ని స్వీకరించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ గెజిట్ లో ఆ విషయాన్ని తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2020 కు సంబందించిన ప్రభుత్వ గెజిట్ లోని వివరాల ప్రకారం. .. గతేడాది ఏకంగా 47 శాతం మంది హిందూ మతంలోకి మారారు.
ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. క్రైస్తవ మత ప్రాబల్యం అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో ముస్లిం మతస్తులు కూడా అదే స్థాయిలో ఉంటారు. ఈ రాష్ట్రం లో 506 మత మార్పిడులు నమోదయ్యాయి. అందులో 241 మంది ఇస్లాం, క్రిస్టియన్ మతాల నుంచి హిందూ మతంలోకి వచ్చారు. ఇలా హిందువులుగా మారిన వారిలో అత్యధికులు క్రైస్తవ మతానికి చెందిన వారే ఉండటం విశేషం.
దేశంలోనే అత్యధిక శాతంగా ఉన్న హిందూ మతస్థులు వేరే మతాలకు ఆకర్షితులు కావడం, మతం మార్చుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. అయితే హిందూ మతంలో మాత్రం ఈ విధంగా జరగడం చాలా అరుదనే చెప్పుకోవాలి. హిందూ సమాజంలోని మత గురువులు మత మార్పిడులను ప్రోత్సహించకపోవడం కూడా అందుకు కారణం కావచ్చు. కానీ తాజాగా చోటుచేసుకున్న పరిణామం ఊహించని విధంగా ఉంది.
ఇటీవల కేరళ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత మార్పిడులను నిరోధించే విధంగా బిల్లు తెస్తామని బీజేపీ ప్రకటించింది. ఇతర మతస్థులను బలవంతంగా మతం మార్చడం, మతం మార్చడం కోసమే పెళ్లి చేసుకోవడం లాంటివి నిరోధిస్తామని మానిఫెస్టోలో పేర్కొంది. అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారడం విశేషం.