డైరెక్టర్ శంకర్.. దక్షిణాది లో ఈ పేరు తెలియని వారుండరు. ఒకప్పుడు ఈ దర్శకుడు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండేది. శంకర్ ఏ సినిమా తీసినా సంచలనమే. కానీ కొంత కాలంగా ఈ దర్శకుడి టైం ఏమీ బాగోలేదు. కమల్ హాసన్ తో తెరకెక్కిస్తున్న భారతీయుడు సినిమా సీక్వెల్ లో జరిగిన ప్రమాదం తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రస్తుతం ఆ సినిమా సైడ్ అయిపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి ఇటీవలే రామ్ చరణ్ తో ఒక సినిమాను అనౌన్స్ చేసాడు.
మరోవైపు బాలీవుడ్ లో రన్ వీర్ సింగ్ తో ‘అన్నియన్’ సినిమాను రీమేక్ చేయనున్నాడు. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘అన్నియన్’ సినిమా తెలుగులో ‘అపరిచితుడు’గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకోవాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఈ సినిమాకు బ్రేక్ పడేలా ఉంది. ఈ సినిమా నిర్మాత రవిచంద్రన్ రూపంలో మరోసారి శంకర్ ను కష్టాలు పలకరించాయి.
అన్నియన్ సినిమా కథపై తనకు పూర్తి హక్కులు ఉన్నాయని తన అనుమతులు లేకుండా బాలీవుడ్ లో ఎలా రీమేక్ చేస్తారని సినిమా నిర్మాత ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్నియన్ సినిమా స్టోరీకి అసలు రైటర్ సుజాత రంగరాజన్. ఆయన బతికి ఉన్నప్పుడే అతనికి డబ్బులు చెల్లించి అపరిచితుడు కథను తాను కొనుగోలు చేసానని నిర్మాత రవి చంద్రన్ చెప్తున్నట్టుగా ప్రెస్ నోట్ లో ఉంది.
తనను సంప్రదించకుండానే తన కథతో సినిమాను రీమేక్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా రీమేక్ చేయడానికే శంకర్ వర్గం మొగ్గు చూపితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని నిర్మాత ప్రెస్ నోట్ ద్వారా తెలిపాడు. అయితే ఈ ప్రెస్ నోట్ నిజమైనదా కాదా అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ వార్త శంకర్ అభిమానులను కలవరపెడుతుంది.