సంక్రాంతి అంటేనే తెలుగువాళ్లకు సినిమా పండగ. కొత్త సినిమాలను విడుదల చేయడానికి ఈ సీజన్ కు మించిన మంచి సమయం ఇంకోటి ఉండదు. ఒకేసారి నాలుగైదు సినిమాలు విడుదల చేసిన కలెక్షన్లకు ఢోకా ఉండదని నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే సంక్రాంతి రేసులో ఉంచడానికి ముందుగానే సినిమాలను సిద్ధం చేసుకుంటారు. ఇక బడా హీరోల సినిమాలు సంక్రాంతి పండగకు విడుదలవుతున్నాయంటే అభిమానులు చేసే సందడి అంత ఇంతా కాదు. కానీ ఈ ఏడాది మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కరోనా కారణంగా ప్రపంచమంతా తలకిందులైన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రభావం సినిమా పరిశ్రమపై భారీగా పడింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలవ్వాల్సిన బడా సినిమాలని షూటింగ్ పూర్తికాకుండానే మిగిలిపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సీజన్లో బరిలో నిలవనున్నవి కేవలం నాలుగు సినిమాలు మాత్రమే. అందులో ఒక్క రవితేజ క్రాక్ తప్పించి పెద్ద హీరోల సినిమాలు లేనే లేవు. మరి మిగిలిన సినిమాల సంగతేంటో చూద్దాం..
మాస్ మహారాజా రవితేజ వరుస ప్లాప్ ల తర్వాత మళ్ళీ ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. గతంలో రవితేజతో ‘డాన్ శీను’, ‘బలుపు’ లాంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. శృతి హాసన్ మరోసారి రవితేజతో జోడీ కట్టింది. కొన్నేళ్ల కిందట కూడా రవితేజ హిట్లు లేక డీలా పడ్డ సమయంలో వరుసగా గోపీచంద్ మలినేని రెండు హిట్లు ఇచ్చాడు. దీంతో ఆయన మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. దీంతో ఇప్పుడు కూడా వీరిద్దరి కాంబినేషన్ మ్యాజిక్ చేయబోతోందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఈ సినిమాను మూడేళ్ళ కిందట తమిళ హీరో విజయ్ సేతుపతి నటించిన ‘సేతుపతి’ సినిమా ఆధారంగా తెరకెక్కించారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ల లో కూడా అదే విషయం తెలుస్తుంది . అయితే ఈ విషయంపై సినిమా టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇదే సినిమాను జయంత్ సి ఫర్జాని ‘జయదేవ్’ పేరుతో తెలుగులో రీమేక్ చేసాడు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో అని అభిమానుల్లో ఓ సందిగ్దత నెలకొంది. ఈ సినిమాకు గతంలో ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా కూడా అక్కడ విడుదల చేయడానికి సినిమా టీమ్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గతుండటం, వాక్సిన్ వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. దీంతో ఈ సినిమా జనవరి 14 న థియేటర్లలో విడుదల చేయనున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘రెడ్’ సినిమా కూడా జనవరి బరిలో ఉందనే ప్రచారం జరుగుతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు ఈ హీరో. రెడ్ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ ను ఈ సినిమాలో రామ్ లుక్. మరోవైపు ఈ సినిమాలొ రామ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తుంది. గతంలో ‘నేను శైలజ’ సినిమాతో రామ్ కు మంచి విజయాన్ని అందించిన కిషోర్ తిరుమల మరోసారి రామ్ ను డైరెక్ట్ చేయనున్నాడు. రామ్ కు జోడీగా మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ నటించారు. ఈ సినిమా ఓటిటి లో విడుదల అవుతుందని మొదట ప్రచారం జరిగినా తమకు అలాంటి ఆలోచన లేదని ఇప్పటికే నిర్మాత స్రవంతి రవి కిషోర్ స్పష్టం చేసారు. దీంతో రెడ్ సినిమా కూడా సంక్రాంతికే సందడి చేయనున్నట్టుగా తెలుస్తుంది.
రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఫ్యాన్ ఇండియా సినిమా ‘అరణ్య’ కూడా ఎట్టకేలకు థియేటర్లలోనే విడుదలవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషలోప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రానాకు దక్షిణాదితో పాటుగా బాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉంది. గతంలో రానా బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ , బాహుబలి వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. దీంతో రానా అరణ్య సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో ‘హాథీ మేరే సాథీ’ పేరుతో విడుదలవుతుంది. ఈ సినిమా ఎలాంటి పోటీ లేకుండా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూడు సినిమాలతో పాటుగా జనవరి 14 ను లాక్ చేసిన మరో సినిమా తమిళ స్టార్ హీరో నటించి ‘మాస్టర్’.
గతంలో ‘ఖైదీ’ సినిమాతో తెలుగు, తమిళ భాషలో హిట్టు కొట్టిన దర్శకుడు లోకేష్ కానగరాజ్ దర్శకత్వం లో తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై రెండు పరిశ్రమల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సీనియాలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా నటిస్తుండటం విశేషం. విజయ్ కు జోడిగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఈ సినిమాను జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కాగా ఈ ఏడాది ఈ నాలుగు సినిమాలు తప్ప మరో సినిమా థియేటర్లలో విడుదల కావడం లేదు. ఇవన్నీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలే కావడంతో అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.