మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. నిత్యావసరాల ధరలు మాత్రం ఇంకా అదుపులోనే ఉన్నాయి. కానీ పక్క దేశమైన పాకిస్థాన్ లో మాత్రం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆదాయాన్ని పెంచేందుకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ నిత్యావసరాల ధరలను ఎడా పెడా పెంచేసింది. ఇప్పుడు ఆ దేశం ద్రవ్యోల్బణం బారిన పడింది. దీంతో పాకిస్థాన్ దేశం ఎప్పుడూ లేనంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.
ద్రవ్యోల్బణం కారణంగా డబ్బుకు విలువ తగ్గిపోవడంతో ఒక బ్యాగు నిండా సరుకులు కొనాలంటే అదే బ్యాగు నిండా డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో అక్కడి పౌరులు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మన దేశంలో రూ. 5 రూపాయలకు లభించే కోడి గుడ్డు ప్రస్తుతం పాకిస్థాన్ లోని రావల్పిండిలో రూ. 30 కి లభిస్తుంది. డజన్ గుడ్లు కొనాలంటే రూ. 350 రూపాయలు చెల్లించాల్సిందే. అదే మన దగ్గర రూ. 50 కు లభించే కిలో అల్లాన్ని పాకిస్థానీలు రూ. 1000 చెల్లించి కొనుక్కుంటున్నారు. ఆ దేశంలో గతఏడాది డిసెంబర్ నుంచి ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
నిత్యావసరాల ధరలే ఇలా ఉంటె ఇక మాంసాహార ప్రియుల మాటేమిటనే సందేహం కలుగుతుంది కదూ. మాంసాహార ధరలు కూడా అక్కడ చుక్కలనంటుతున్నాయి. పాకిస్థాన్ లోని కరాచీలో కిలో చికెన్ ధర రూ. 370, బీఫ్ ధర రూ. 450, మటన్ ధర రూ. 900 లకు చేరుకుంది. మరోవైపు వంట గ్యాస్ కొరత ప్రజలను తీవ్రంగా వేధిస్తుంది. వీటితో పాటుగా దాయాది దేశంలో ముడి సరుకులు, పశుగ్రాసం ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాలను చూస్తుంది.
ఇదిలా ఉంటె ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కోవడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నడుం బిగించారు. ఇప్పటికే అక్కడ మార్కెట్ కమిటీలను రద్దు చేసారు. అయితే పాకిస్థాన్ లో చక్కర రేట్లు మాత్రం తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఇక్కడ చక్కర ధరలు కేజీ రూ. 100 రూపాయలు ఉండగా ఇప్పుడు రూ. 80 కి తగ్గింది. దీనినే ఇమ్రాన్ ప్రభుత్వం తాము సాధించిన గొప్ప ఘనతగా ప్రచారం చేస్తుండటంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.