ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై ఓ దుండగుడు దాడికి ప్రయత్నించాడు. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో ఇవాళ ప్రజలతో మంత్రి మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి పదునైన తాపీతో మెడపై దాడికి ప్రయత్నించాడు. దాడి చేస్తున్న విషయం వెంటనే గుర్తించిన మంత్రి పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది.
మంత్రి పేర్ని నానిపై దాడికి ప్రయత్నించిన దుండగుడిని మంత్రి అనుచరులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మంత్రిపై దాడి చేసింది ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవలే మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కర్రావును రాజకీయ ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఏకంగా మంత్రిపైనే దాడికి యత్నించడం సంచలనంగా మారింది. మంత్రిపై దాడికి యత్నించిన వ్యక్తి తాపీ మేస్త్రీ నాగేశ్వరరావు అని పోలీసులు గుర్తించారు. నాగేశ్వరరావు ఎందుకు మంత్రిపై దాడి చేయాల్సి వచ్చింది, ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, దాడికి ఎందుకు ప్రయత్నించారో తనకు తెలియదని, పోలీసులే ఈ విషయాన్ని తేలుస్తారని మంత్రి చెబుతున్నారు.