ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ మాజీ ఎంట్రీ భూమా అఖిల ప్రియ ఆమె భర్త పాత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడు. అయితే ఈ మొత్తం ఘటనలో గుంటూరు శ్రీను అనే వ్యక్తి కీలకంగా మారాడు. భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఇతను గతంలో ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్రలో కూడా ప్రముఖ పాత్ర పోషించినట్టుగా పోలీసులు గుర్తించారు.
అప్పుడు మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అతను పోలీసుల చేతికి చిక్కితే ఈ కేసులో అసలు విషయాలు బయటకు రానున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు శ్రీను ఎవరు? టీ స్టాల్ నడుపుకునే వ్యక్తితో అఖిల ప్రియ కుటుంబానికి సాన్నిహిత్యం ఎలా కుదిరింది? అనే ప్రశ్న తలెత్తింది. తాజాగా ఇతని బ్యాక్ గ్రౌండ్ తెలిసిన వారు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.
గుంటూరు శ్రీను అసలు పేరు మాదాల శ్రీను. గుంటూరులోని డొంక రోడ్డులో ఉండే ఇతను ఇంజినీరింగ్ మధ్యలో ఆపేసి తండ్రి టీ స్టాల్ ను నడిపేవాడు. మూడేళ్ళ క్రితం ఇతనికి భార్గవ్ రామ్ తో పరిచయం ఏర్పడింది. అఖిల ప్రియ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా నగర్ లో ఉండే ఆమె ఇంటికి ఇంటీరియర్ డిజైనింగ్ పనులు ఇతనికి అప్పజెప్పారు. అఖిల ప్రియా, భార్గవ్ రామ్ వివాహం సమయంలో వీరిద్దరి మధ్యన సంబంధాలు మరింత బలపడ్డాయి.
అప్పటి నుంచి భూమా కుటుంబానికి సంబందించిన ఎన్నో సెటిల్ మెంట్లు చేసాడని అవసరమైతే దాడులు చేయడానికి కూడా అవెనకాడడని అతని గురించి తెలిసిన వారు చెప్తున్నారు. తాజాగా జరిగిన కిడ్నాప్ ఉదంతంలో కూడా పక్కా ప్లాన్ ను అమలు చేసాడు గుంటూరు శ్రీను. అచ్చం సినీ ఫక్కీలో బాధితులను ఐటీ ఆఫీసర్లుగా నమ్మించాడు.
అందుకోసం నగరంలోని శ్రీ నగర్ కాలనీలో ఐటీ ఆఫీసర్లు వేసుకునే బట్టలను అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఓ సినీ ట్రైనర్ దగ్గర ఐటీ ఆఫీసర్ లా ఎలా వ్యవహరించాలనే మెళుకువలు నేర్చుకున్నాడు. ఇలా పక్కా పథకం ప్రకారం ప్లాన్ అమలు చేసాడు. ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా గుంటూరు శీను కోసం గాలిస్తున్నారు.