ప్రతి మనిషి తమ జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి. లేదంటే వారికి విముక్తి లభించదు. వారసులు పితృ కార్యాలు నిర్వహించకపోతే మరణించిన వారు ఆకలితో అలమటిస్తారని శాస్త్రం చెప్తుంది. మహాలయ అమావాస్య నాటి నుంచి పదిహేను రోజుల వరకు పితృకార్యాలను నిర్వహిస్తారు. ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవి. మహాలయ అమావాస్య సందర్భంగా ఈ పదిహేను రోజులలో చేసే అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఎలాంటి దానాలు చేయలేని వారు పశువులకు గ్రాసమైనా సమర్పించాలి.
ఈ రోజుల్లో సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆనాటి నుంచి పదిహేను రోజుల వరకు మన కుటుంబంలో మరణించిన వారు గుమ్మం ముందుకు వచ్చి నిలబడతారని అలాంటి సమయంలో వారికి శ్రాద్ధ కర్మలు చేయకుంటే ఆకలితో శపించి వెళ్ళిపోతారని పెద్దలు అంటారు. గత జన్మలో ఎవరైనా వారి తలిదండ్రులకు, వృద్దులకు కష్టం కలిగించి ఉంటె అలాంటి వ్యక్తులు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటారు.
తరచూ అనారోగ్య సమస్యలకు గురి కావడం, ఏ పని ప్రారంభించినా విజయం సాధించలేకపోవడం ఇలా ప్రతి పనిలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇవి తరతరాల నుంచి ఆ కుటుంబానికి శాపంగా మారుతుంటాయి. కుటుంబంలోని స్త్రీలకు చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం, వ్యక్తులకు సంఘంలో గౌరవ మర్యాదలు లేకపోవడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం మరణించడం ఇలా తీవ్రమైన సమస్యలకు పితృదోషాలే కారణమవుతాయి.
అలాంటి వారు రానున్న ఈ మహాలయ అమావాస్య రోజు నుంచి పితృ కార్యాలను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తే పూర్వీకులు, తల్లిదండ్రుల వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయి. వారికి ముక్తిని ఇచ్చినవారవుతారు. ఈ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకుని పూర్వీకులను స్వాగతించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఎవరూ జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. కాకులకు వాటికి ఇష్టమైన ఆహారాన్ని తినిపించాలి.
పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వల్ల ఆ కుటుంబానికి దీర్ఘాయుష్షు, విద్యా, ధన ప్రాప్తి కలుగుతాయి. సుఖ సంతోషాలతో తులతూగుతారు. వారి వారసులకు జీవితంలో అభివృద్ధి, స్థిరత్వం కలిగేలా పెద్దలు ఆశీర్వదిస్తారు. సంవత్సరానికి తిథులను అనుసరించి శ్రాద్ధ కర్మలు నిర్వహించే దానికన్నా ఈ రోజుల్లో చేసే కర్మల ఫలితాలు వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారని శాస్త్రం చెప్తుంది.