రాష్ట్రంలో ఓవైపు టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం వేడెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమిస్తా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిన్ననే భారత్ బంద్లో పాల్గొని కేంద్ర విధానాలపై ఇక యుద్ధమే అనే సిగ్నల్స్ ఇచ్చింది. ఈ పరిణామాలన్నీ రానున్న రోజుల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా రాష్ట్రంలో రాజకీయాలు ఉంటాయనే అంచనాలు కలిపిస్తున్నాయి.
కానీ, అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి ఆయన లేఖ రాశారు.
గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సీఎం కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలి’’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.