కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కె ఏ పాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటు విమర్శలు చేసారు. బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండా కె ఏ పాల్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికలపై బండి సంజయ్ మాట్లాడుతూ.. భగవద్గీతకు, బైబిల్ కు మధ్య పోటీ అంటూ చేసిన వ్యాఖ్యలపై కె ఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు స్పోషర్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసారు.
ఎవరో బీజేపీ లోకల్ నాయకుడు. బైబిల్ పట్టుకున్నవారికి ఓటు వేస్తారా? భగవద్గీత పట్టుకున్నవారికి ఓటు వేస్తారా? అంటూ చాలా దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసలు అతను ప్రెస్ మీట్ లో మాట్లాడే ముందు బీజేపీ జాతీయ నాయకులను సంప్రదించాలి. రామ్ లాల్ లాంటి వారు నాతో చాలా చక్కగా మాటాడతారు.
ఆర్ఎస్ఎస్ నాయకులు ఇంద్రస్, బయాజోషి ఎన్నోసార్లు నా హోటల్ కు వచ్చారు. రామ్ లాల ఓ సారి నా మోకాలికి తాకి, నా చేతిని ముద్దాడారు. పాల్ గారు దేశాన్ని మీరీ కాపాడాలని నాతో ఎంతో మంది కోరారు. అంతెందుకు బీజేపీ మద్దతు ఇస్తే కలిసి అభివృద్ధి చేయొచ్చని, అవినీతిని నిర్మూలించవచ్చని ఎంతో మంది బీజేపీ అగ్రనేతలు నన్ను అడిగేవారంటూ ఆయన చిట్టా విప్పారు.
ప్రధాని మోదీ ట్రంప్ చుట్టూ తిరిగితే ట్రంప్ నా చుట్టూ 18 సంవత్సరాలు తిరిగాడు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాతో 25 ఫోటోలు తీసుకున్నాడు. అందరినీ కలుపుకుని పోవాలని అనుకున్న తనపైకి ఏపీ, తెలంగాణలోని రాజకీయ నాయకులు కుళ్లు, కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. పరిశుద్ధ గ్రంథాలతో ఆటలాడవద్దంటూ హెచ్చరించారు.
మరో వైపు ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ నారా చంద్రబాబు నాయుడు పై కె ఏ పాల్ నిప్పులు చెరిగారు. రెండు రోజులుగా క్రైస్తవులపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బాబు గారు కొడుకుని సీఎంను చేయాలని కలలు కంటున్నారు. మొన్నటిదాకా పాల్ గారూ ఏసు ప్రభువు కృపా అన్న బాబు ఇప్పుడు క్రైస్తవులను తిడుతున్నారన్నారు.