తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఎక్కువ మంది హీరోలను పరిచయం చేసింది మెగా ఫ్యామిలీనే. మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, కల్యాణ్ దేవ్ లు ఇండస్ట్రీకి వచ్చారు. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా మారనున్నాడు. వీరితో పాటుగా నాగబాబు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. నిహారిక కూడా పలు వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటించింది. ఆ తర్వాత టీవీ షోలలో హోస్ట్ గా కూడా చేసి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అయితే ఈ హీరోలకు సక్సెస్ అంత ఈజీగా రాలేదనే చెప్పాలి. హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లో యాక్టింగ్, లుక్స్ పరంగా అల్లు అర్జున్ తో సహా ఇప్పటి సాయి ధరమ్ తేజ్ వరకు అంతా విమర్శలు ఎదుర్కొన్నవారే. మెలిమెల్లిగా ఆడియన్స్ సపోర్ట్ తో ఇప్పుడు టాలీవుడ్ లో తమకంటూ ఓ మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగారు. ఇదిలా ఉంటె ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. అందుకు సంబందించిన వార్త ఒకటి ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఇటీవలే నాగబాబు కుమార్తె నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ కొత్తల్లుడు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవ్వనున్నాడని సమాచారం. గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడైన జొన్నలగడ్డ చైతన్య ప్రస్తుతం హైద్రాబాద్లో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లో తన లక్ ను పరీక్షించుకున్నాడు. ఇప్పుడు చైతన్య కూడా సినిమాలపై ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. వచ్చే ఏడాది టాలీవుడ్ ఎంట్రీకి చైతన్య ప్లాన్ చేసుకుంటున్నాడట. మంచి హైట్, చూడటానికి హ్యాండ్సమ్ గానే ఉన్నా లుక్స్ ఉన్నంత మాత్రాన హీరోలుగా రాణిస్తారని నమ్మకం లేదు. అందుకే ముందుగా నటనలో శిక్షణ తీసుకోవాలని అతను భావిస్తున్నాడట. ప్రస్తుతం మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలంతా దాదాపుగా సక్సెస్ అయిన వారే ఉన్నారు. అయితే తాను మాత్రం అందరిలా కాకుండా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ను ఫాలో అవ్వాలని చూస్తున్నాడు చైతన్య.
మెగా హీరోల సహకారం లేకుండా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. కళ్యాణ్ దేవ్ కూడా గతంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతను కూడా సొంతంగా ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు. అందుకోసం కొత్త దర్శకులు, కొత్త కథలను ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు చైతన్య కూడా ముందుగా సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడట. ఎలాగో నిహారికకు గతంలో వెబ్ సిరీస్ లు చేసిన అనుభవం ఉంది. అలాగే ‘పింక్ ఎలిఫాంట్’ పేరుతో సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకున్న నిహారిక నిర్మాతగా కూడా మారింది. కాబట్టి అది తనకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడట. ముందుగా వెబ్ సిరీస్ ల ద్వారా వచ్చే ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా ఎంట్రీ ప్లాన్ చేసుకోనున్నాడని తెలుస్తుంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.