జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం జనగామ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముత్తిరెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కూడా ఈ కార్యకమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ నాయకుడు మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారని, సీనియారిటీ ఆధారంగా పదవులు ఇవ్వాలని అన్నారు.
ఆ తర్వాత ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో నిన్న మొన్న వచ్చిన వారికే పదవులు వచ్చాయని పార్టీలో సీనియర్ గా ఉన్న తనకు మాత్రం ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదని అన్నారు. అయితే అందుకు తానేమీ బాధపడటం లేదని పార్టీకి సీఎం కేసీఆర్ కు విధేయుడిగానే పని చేస్తూ వచ్చానని అన్నారు. పార్టీలో కార్యకర్తలకు, నేతలకు ఎలాంటి కష్టం వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కారం చూపుతారన్నారు.
సూర్యచంద్రులు ఉన్నత వరకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ముత్తిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇకపై పార్టీ శ్రేణులు చెప్పిందే తనకు వేదమని.. కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు అంటూ ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్ వల్లనే తనకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. అయితే ముత్తిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి పదవుల విషయంలో హై కమాండ్ పై ఉన్న అసంతృప్తిని ముత్తిరెడ్డి ఈ విధంగా బయటపెట్టారా? అని అనుకుంటున్నారు.