వేసవిలో ఎక్కువగా వేధించే అతిసార వ్యాధి మరోసారి పంజా విసురుతుంది. ఓ వైపు కరోనా మరోవైపు అతిసార వ్యాధితో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో అతిసార వ్యాధి ప్రబలి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధితో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఈ వ్యాధిని డయేరియా అని కూడా పిలుస్తారు. అతిసారం రావడానికి ప్రధాన కారణం కలుషిత నీరే. అందుకే రోడ్లపై అమ్మే పానీయాలకు, చిరుతిళ్ళకు దూరంగా ఉండాలి. ఎక్కువగా ఫిల్టర్ నీటిని లేదా మరగబెట్టిన నీటిని తాగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తాగునీటి కుళాయిల వద్ద పరిశుభ్ర వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలి. ఇది మామూలుగా రోటా వైరస్ వల్ల వస్తుంది. ఎక్కువగా విరేచనాలు కావడం దీని లక్షణం.
వీటితో పాటు రక్తం పడితే దానిని ‘డీసెంట్రి’ అంటారు. ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువసార్లు వదులుగా విరేచనాలు అవుతుంటే దానిని అతిసారం అంటారు. రోజుకు మూడు కంటే ఎక్కువ సార్లు పలుచగాను, జిగటగానూ విరేచనాలు అయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. పిల్లల్లో అతిసారం సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల లోపల తగ్గిపోతుంది. లేదంటే రెండు వారాల వరకూ ఉంటుంది.
పెద్దవారిలో సాధారణంగా రెండు నుండి నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. మనిషిని పీల్చి పిప్పి చేసే అతిసారం బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి ఎక్కువగా వెళ్ళకూడదు. కలుషితమైన నీటిని తాగినా, వ్యక్తిగత పరిశుభ్రత లేకున్నా అతిసారం సోకుతుంది. తినే ఆహర పదార్థాలు కలుషితం అయినా వాటిని తిన్నా వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటె ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్సలు చేయించుకోవాలి. అతిసారం బారిన పడిన వారికి ముఖ్యంగా విశ్రాంతి చాలా అవసరం. రోజుకి కనీసం నాలుగైదు సార్లు ఉప్పు, పంచదార కలిపిన నీరు తాగించాలి. పాలు కలపని సగ్గుబియ్యం జావ పట్టించాలి. రోగి వికారం కారణంగా నోటి ద్వారా ద్రవ పదార్ధాలను తీసుకోవడం కష్టం అయితే…. అలాంటి వారికి సెలైన్ ఎక్కించడం ద్వారా చికిత్స అందిస్తారు.