కాళ్ళలో వాపు అనేది చాలా సాధారణమైన విషయమే. కొందరిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా కాళ్లలో వాపు వస్తుంటుంది. మధ్య వయసువారిలో కూడా ఈ సమస్య కనిపించవచ్చు. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. రోజంతా ఒకే స్థితిలో కూర్చోవడం, నిల్చోవాల్సి రావడం, ప్రయాణాలు ఎక్కువగా చేయడం ఇలా కొన్ని కారణాల వల్ల కాళ్లలో వాపు వస్తుంటుంది. ఉదయం లేచిన వెంటనే కాళ్లలో వాపులు రావడం జరుగుతుంది. కాసేపు అటు ఇటు తిరిగితే వెంటనే సాధారణ స్థితికి వస్తుంది. శరీరంలో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు ఇలా జరుగుతుంటుంది.
ఇలాంటి వారు ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ తో కాళ్ల వాపును తగ్గించుకోవచ్చు. ముందుగా రోజంతా కుర్చుని లేదా నిలబడి పని చేసే అలవాటు ఉంటె దానిని వెంటనే మానేయండి. కనీసం గంటకు ఒకసారైనా పని నుండి విరామం తీసుకుని నాలుగు అడుగులు వేయండి. పడుకునే ముందు పాదాలను కొంచెం ఎత్తులో ఉంచుకోవాలి. కాళ్ల కింద దిండు, కుషన్ లాంటివి ఉంచుకుని నిద్రపోతే ఉదయం వాపు కనిపించదు.
పాదాల వాపును నిమిషాల్లో తగ్గించడానికి వేడి నీటిలో కాళ్ళను ఉంచడం చాలా మంచిది. ఆ నీటిలో ఉప్పు లేదా ఎప్సమ్ సాల్ట్ ను వేయాలి. ఎప్సమ్ సాల్ట్ వాడితే త్వరగా ఫలితం ఉంటుంది. ఇందులో వాపును, వాపు కారణంగా వచ్చే కండరాల నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. శరీరంలో ఇంఫ్లమేషన్ కారణంగా ఏర్పడే సమస్యలను తొలగిస్తుంది. విష వ్యర్థాలను బయటకు లాగేసి వాపును నివారిస్తుంది. దీంతో కాళ్ల వాపు నుంచి నిమిషాల్లో రిలీఫ్ లభిస్తుంది.
కాళ్ల వాపులు రాకుండా ఉండాలంటే ఆహారంలో ఉప్పును తక్కువగా తీసుకోవాలి. అందుకు బదులుగా మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. బ్రకోలీ, జీడి పప్పు, బాదం పప్పు, అవకాడో, డార్క్ ఛాక్లేట్, టోఫు పనీర్, పాల కూర వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. అయితే ఎంతకీ పాదాల్లో వాపు తగ్గకుండా ఉంటె మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొన్ని సార్లు కాళ్ళ వాపులు గుండె, కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంకేతాలుగా వస్తాయి.