భారత దేశ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతంగా మార్చి శత్రు దుర్భేద్యం చేసే రఫేల్ యుద్ధ విమానాల కోసం 2016 లోనే భారత్- ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత్-చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు వస్తుండటం విశేషం. శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూ బుధవారం అంబాలా ఎయిర్బేస్లో రాఫెల్ విమానాలు సందడి చేయనున్నాయి. భారతీయులకు నిజంగా ఇదొక శుభవార్తే. ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధవిమానాల రాకపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఫ్రాన్స్ నుంచి యుద్ధవిమానాల రాకలో ఫ్రాన్స్లోని భారత రాయబారి జావేద్ అష్రాఫ్తో పాటు మరో వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అధికారి గురించే చర్చ నడుస్తుంది. అతనే ఎయిర్ కామోడోర్ హిలాల్ అహ్మద్ రాథర్. గత నెలలో రక్షణ శాకా మంత్రి రాజ్ నాథ్ సింగ్ హిందూ సంప్రదాయంలో యుద్ధ విమానాలకు ‘అస్త్ర పూజ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయం చేసి హిలాల్ అహ్మద్ అందరి దృష్టిని ఆకర్షించారు.
రఫేల్ తొలి యుద్ధవిమానాన్ని నడుపుతున్న తొలి భారతీయ పైలట్ కూడా ఇతనే. ఆయన ప్రస్తుతం భారత దేశపు ‘ఎయిర్ అటాచ్ టు ఫ్రాన్స్గా’ సేవలందిస్తున్నారు. కాశ్మీర్ లోని అనంతనాగ్ చెందిన ఈ ఐఏఎఫ్ ఆఫీసర్ 1988 డిసెంబర్ 17న ఫ్లైయింగ్ బ్రాంచ్ లో ఫైటర్ పైలట్ గా నియమితులయ్యారు. అనంతరం ఎయిర్ కమాండో వరకు ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2010 లో వాయుసేన పతకాన్ని, 2016 లో గ్రూప్ కెప్టెన్గా విశిష్త్ సేవా పతకాన్ని పొందారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్వోర్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. శత్రు దేశాలు భారత్ తో యుద్దానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో రాఫెల్ విమానాలను భారత్ కు త్వరగా రప్పించడంలో ఈ అధికారి కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తున్నారు. అంతేకాదు భారత వాతావరణానికి అనుగుణంగా రఫెల్ ను తీర్చిదిద్దారు. భారతీయ వైమానిక దళ అధికారిగా మిరేజ్ 2000, మిగ్ 21, కిరణ్ యుద్ధ విమానాలను 3 వేల ఫ్లైయింగ్ అవర్స్ ను విజయవంతంగా, ప్రమాదం లేకుండా నడిపించడం హిలాల్ అహ్మద్ ట్రాక్ రికార్డ్. దేశంలోనే అత్యుత్తమ ఫ్లైయింగ్ ఆఫీసర్ ఘనతను హిలాల్ అహ్మద్ దక్కించుకున్నారు. మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించిన అధికారిగా ఆయన పేరు నిలిచిపోనుంది.