సినీ హీరో నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో పడుతుంటే చూస్తూ ఊరుకోవద్దని, పిడికిలి బిగించి గొంతెత్తి పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు. సమిష్టి కృషితో ఈ కార్మిక సౌధాన్ని ప్రైవేటుపరం కాకుండా చేయాలన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా నారా రోహిత్ ప్రజలకు పిలుపునిచ్చారు.
”కూల్చడానికది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు. 32 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. నేడు ఉక్కు పరిశ్రమ ఉనికి ప్రమాదంలో పడుతోంది..ఆంధ్రుడా మేలుకో. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడింది. సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ శ్వేదం ప్రైవేటు పరం చేయడమేనా మన సాధించిన అభివృద్ధి? ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో పిడికిలి బిగిద్దాం. గొంతు పెగలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దాం” అంటూ నారా రోహిత్ వ్యాఖ్యలు చేసారు.