గ్రేటర్ హైదరాబాద్ కు మేయర్ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. మెజారిటీ దక్కకపోయినా గ్రేటర్లో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా తమకే మేయర్, డెప్యూటీ మేయర్ పీఠం దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ మేయర్ రేసులో అందరి దృష్టి బంజారాహిల్స్ కార్పొరేటర్ పైనే ఉంది. సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండు సార్లు ఎన్నికయ్యారు.
టీఆర్ఎస్ నుంచి ఆమె పేరు దాదాపుగా ఖరారు అయినట్టుగా రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మేయర్ అభ్యర్థి పేర్లను సీఎం కేసీఆర్ షీల్డు కవర్లలో ఉంచి పంపిస్తాని తెలిపారు. కాగా మేయర్ గా కె కేశవరావు కుమార్తె గద్వాల విజయ లక్ష్మి, అటు డెప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత పేరు దాదాపు ఖరారైనట్టుగా సమాచారం అందుతుంది. మరికొద్దిసేపటిలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని ఆమె నివాసం వద్ద సన్ధాది మొదలైంది. కాగా గురువారం ఉదయం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో గద్వాల విజయ లక్ష్మి, మోతె శ్రీలత పేర్లను అధిష్ఠానం ఖరారు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పంపిన షీల్డు కవర్ ను ఎన్నికల విప్ ప్రభాకర్ తెరవనున్నారు. గ్రేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాలలో విజయం సాధించగా బీజేపీ- 48, ఎంఐఎం- 44, కాంగ్రెస్ 2 స్థానాలలో గెలుపొందాయి.