రాష్ట్రంలో త్వరలో జరగనున్న పదోతరగతి పరీక్షలపై విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుండటం మరోవైపు ఎండలు మండిపోతుండటంతో విద్యార్థుల పరీక్షా సెంటర్ల విషయంలో మార్పులు చేసింది. పరీక్షా కేంద్రాలను విద్యార్థులు చదివే పాఠశాల నుంచి కేవలం 5 కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో విద్యార్థులు పరీక్షలు రాయాలంటే కనీసం 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అదే మారుమూల ప్రాంతాలు, పల్లెల్లో చదివే విద్యార్థులు 15 కిలోమీటర్లు వెళ్లి పరీక్షలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 5 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలు లేకుంటే సమీపంలో ఉన్న ఎయిడెడ్ కళాశాలలను, ప్రభుత్వ జూనియర్ కలశాలలను కూడా పరీక్షా కేంద్రాలుగా వినియోగించుకోవచ్చని అధికారులకు ఆదేశాలు అందాయి.
ఇప్పటికే ప్రశ్న పత్రాలను 11 నుంచి 7 కు కుదించిన ప్రభుత్వం తాజా నిర్ణయంతో మరో 2 వేల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అలాగే పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులు కరోనా బారిన పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. గతంలో ఒక్క గదిని 20 నుంచి 22 మంది విద్యార్థులకు కేటాయించేవారు. ఇపుడు కరోనా నేపథ్యంలో ఒక్కో గదిలో కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటున్నారు.