కరోనా నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం విఫలమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేంద్ర మండిపడ్డారు. జేపీ నడ్డా ఓ గల్లీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశంలో అతి చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో తెలంగాణ విఫలమైందన్నారు.
కరోనా కేసులతో పాటుగా రాష్ట్రంలో కరోనా మరణాల రేటు కూడా అధికంగా ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఈటెల కేంద్రం తీరుపై మండిపడ్డారు. కరోనా వైరస్ ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదని ప్రపంచమంతా ఉందన్నారు. కరోనా నియంత్రణ చర్యలను అన్ని రాష్ట్రాల కన్నా వేగంగా ప్రారంభించామని కొన్ని కేంద్ర బృందాలు కూడా ఆ విషయాన్ని ప్రశంసించాయన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఓ సారి సరిచూసుకోవాలన్నారు.
రాజస్థాన్ లో ఉన్న కరోనా కేసులకు ప్రధాని బాధ్యత వహిస్తారా అంటూ ఈటెల ప్రశ్నించారు. దేశానికి కంటైన్మెంట్ ను పరిచయం చేసిందే తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఓవైపు కరోనా తో దేశమంతా పోరాటం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వాలు కూల్చే పనిలో ఉందని విమర్శించారు. నడ్డా ఈ విధంగా బాధ్యత లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రాలను విమర్శించే ముందు కేంద్రం తన బాధ్యత ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు.
విదేశాల నుంచి కరోనా వ్యాపిస్తుంది అందరికన్నా కేంద్రాన్ని అప్రమత్తం చేసింది మా ముఖ్యమంత్రే అన్నారు. కరోనా సమయంలో దీపాలు పెట్టండి, చప్పట్లు కొట్టండి అని ప్రధాని పిలుపునిస్తే.. అందరూ దానిని విమర్శించారని కేసీఆర్ మాత్రం కేంద్రానికి మద్దతు పలికారని గుర్తుచేశారు. రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో తాము కరోనా వ్యాప్తిని అడ్డుకున్న తీరును కేంద్రమే మెచ్చుకుందన్నారు. దాన్ని కూడా బీజేపీ తప్పుపడుతుంది. మీది నీచ సంస్కృతి, మీది శవాల మీద పేలాలు ఏరుకునే స్వభావం. ఇలాంటి చిల్లర రాజకీయాలు తగదు అని ఈటల ఘాటుగా వ్యాఖ్యానించారు.