వయస్సుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. చక్కర ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది అపోహ మాత్రమే. షుగర్ వ్యాధి అనేది వంశ పారంపర్యంగా, అసహజమైన జీవన శైలి కారణంగా వస్తుంటుంది. అయితే చక్కర అధికంగా తీసుకునే వారు స్థూలకాయం బారిన పడతారు. అధిక బరువు కూడా షుగర్ వ్యాధికి కారణమవుతుంది. అంతేగాని చక్కర తీసుకోవడం వల్ల మాత్రమే ఈ వ్యాధి వస్తుందని భావించలేము.
కొంత మందిలో షుగర్ వ్యాధి ఉన్నా అది ఆలస్యంగా బయటపడుతుంది. ఎవరికైనా రక్త దానం చేసేటప్పుడు, వైద్య పరీక్షల సమయంలో షుగర్ ఉన్న విషయం బయటకు వస్తుంది. మహిళల్లో ప్రసవం తర్వాత వచ్చే డయాబెటిస్ రకం కూడా ఉంటుంది. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం వలన అంతర్గత అవయవాలపై ఆ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని లక్షణాలను ముందుగానే గుర్తించడం వలన మీకు షుగర్ ఉందొ లేదో తెలిసిపోతుంది.
షుగర్ వ్యాధి శరీరంలోకి ఎంటరైతే విపరీతమైన దాహం కలుగుతుంది. ఎంత నీరు తాగినా గొంతు ఆరిపోతూనే ఉంటుంది. కొన్ని సార్లు వాతావరణంలో ఉష్ణోగ్రతల వల్ల కూడా అతిగా దాహం ఉంటుంది. అది సమస్య కాదు. కానీ ఈ పరిస్థితు నాలుగైదు రోజుల కన్నా ఎక్కువగా ఉంటె మాత్రం షుగర్ టెస్టు చేయించుకోవాలి.
నీరసం కూడా షుగర్ వ్యాధి లక్షణాలలో ఒకటి. చిన్న చిన్న పనులకే అలసటగా అనిపిస్తుండటం, శరీరాన్ని నీరసం ఆవహిస్తున్నట్టుగా ఉంటె కూడా అనుమానించాల్సిందే. ఇక మరో ముఖ్యమైన లక్షణం అతిగా మూత్ర విసర్జన చేయడం. మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్ళవలసి రావడం కూడా షుగర్ వ్యాధి లక్షణమే. ఇక కాళ్లతో తిమ్మిర్లు రావడం, ఉన్నట్టుండి కంటి చూపు మందగించడం, కాళ్లలో స్పర్శ లేకుండా పోవడం లక్షణాలు కూడా మీరు డయాబెటిస్ బారిన పడ్డారని తెలిపే సూచనలే.
ఈ లక్షణాలు ఒకటి,రెండు రోజులకన్నా ఎక్కువ కాలం కొనసాగుతున్నట్టయితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం వలన షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.