కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజుకి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ లను ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు లక్షలాది మందికి వాక్సిన్ వేయగా అందులో ఎక్కడో ఒక చోట వాక్సిన్ తీసుకున్న వారిలో రియాక్షన్ తలెత్తడం జరుగుతుంది. అందువల్ల చాలా మంది వాక్సిన్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు.
అయితే మన దగ్గర అందుబాటులో ఉన్న వాక్సిన్ లు చాలా సురక్షితమైనవని, అన్ని భద్రతాపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే వాక్సిన్ లకు అనుమతులు ఇచ్చినట్టుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి. వాక్సిన్ తీసుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన ఎలాంటి సమస్యలు రావని అంటున్నారు. ఈ నేపథ్యంలో వాక్సిన్ తీసుకునే ముందు, ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాక్సినేషన్ తర్వాత కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వాక్సిన్ తీసుకునేవారు వ్యాక్సినేషన్ పై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి. వైద్యులను సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితులను వివరించి సలహా తీసుకోవడం మంచిది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటె ఆ విషయాన్ని దాచకూడదు. వాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆందోళనకు గురి కావద్దు. అవసరమైతే అక్కడ ఉన్న వైద్య సిబందితో మాట్లాడి సలహాలు తీసుకోవచ్చు. సెంటర్ కు ముందుగానే వెళ్లి కాసేపు ప్రశాంతంగా కూర్చోండి.
పాజిటివ్ దృక్పథంతో వాక్సిన్ తీసుకోండి. వాక్సిన్ కు ముందు తేలికపాటి భోజనం చేయడం మంచిది. తీసుకున్న తరువాత కొద్దిసేపటి వరకు ఏమీ తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి. వాక్సిన్ వేయించుకునే వారు, వేసుకున్న వారు ఆల్కహాల్, మత్తు పదార్థాలకు ఎట్టిపరిస్థితుల్లో దూరంగా ఉండాలి. చేతి భుజానికి వాక్సిన్ వేస్తారు కాబట్టి అందుకు అనువైన దుస్తులను ధరించండి. వ్యాక్సినేషన్ కేంద్రంలో వస్తువులను, ఉపరితలాలు ముట్టుకోవద్దు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
వాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల్పంగా నొప్పి, వాపు, జ్వరం, చలి, అలసట, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు కనిపించడం సహజం వీటికి ఆందోళన అవసరం లేదు. ఇవి ఒకటి నుంచి రెండు రోజుల వరకు ఉండవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఉంటె వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.