తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈరోజు సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. మొదట గురువారం ఉదయం దుద్దెడ మండలం కొండపాక చేరుకున్న సీఎం రూ. 45 కోట్లతో నిర్మించిన ఐటీ పార్క్ కు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సిద్ధిపేటను అత్యంత క్రియాశీలక ప్రాంతంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతం రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉందని భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. భవిష్యత్తులో సిద్ధిపేట జిల్లా పరిధిలో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టును తీసుకువస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేసారు.
అనంతరం పొన్నాలలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం పార్టీ అధినేత హోదాలలో ప్రారంభించారు. ఆ తర్వాత సిద్ధిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 163కోట్లతో నిర్మించిన 2వేల 460 డబుల్ బెడ్ రూమ్ ఇలాను కేసీఆర్ ప్రారంభించనున్నారు. రూ. 135 కోట్లతో రూపుదిద్దుకున్న వేయి పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. రూ. 278కోట్లతో అభివృద్ధి చేసిన సిద్ధిపేట చింతల్ చెరువును ప్రారంభిస్తారు.