ఏపీ పౌరసరఫరాల శాఖ వాహనాలకు వేసిన రంగుల విషయమై ఎస్ఈసీ నిమ్మగడ్డ హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రేషన్ సరకుల వాహనాలకు వేసిన రంగులను మార్చాలని, ఎన్నికలు ముగిసేవరకు రాష్ట్రంలోని గ్రామాల్లో ఈ వాహనాలు తిరగకుండా చూడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ అంశంపై హై కోర్టుకు వెళ్లారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణచేపట్టిన కోర్టు నిమ్మగడ్డ ఆదేశాలపై స్టే విధించింది. మార్చి 15 వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో విచారణ సందర్భంగా రంగులను మార్చడానికి రెండు నెల్ల సమయం పడుతుందని, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
రేషన్ సరకుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని వివరించింది. అడ్వొకేట్ ఎస్ శ్రీరామ్ మాట్లాడుతూ.. రేషన్ డెలివరీ వాహనాలపై ఉన్న రంగులు ప్రభుత్వరంగులను పోలి లేవని అన్నారు. ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండవచ్చని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తుచేశారు.
జరిగేవి పంచాయతీ ఎన్నికలు వాటితో పార్టీలకు సంబంధం ఉండదు. రేషన్ డెలివరీ అనేది ప్రజాప్రయోజనాలు సంబంధించిన విషయం. ఎస్ఈసీ ఆదేశాల వల్ల రెండు నెలల పాటు ప్రజలకు రేషన్ సరకుల పంపిణీ ఆగిపోతుందని అడ్వొకేట్ జనరల్ కోర్టులో వాదనలు వినిపించారు. కాగా తాజాగా చేపట్టిన విచారణ సందర్భంగా నిమ్మగడ్డ ఆదేశాలను కోర్టు నిలిపివేసింది.