సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మీడియా ముందు ప్రకటించారు మంత్రి పేర్ని నాని. నవరత్నాల్లో భాగంగా మహిళల కోసం ఏటా రూ. 75 వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా చిరువ్యాపారులు, తోపుడుబళ్లు, సంప్రదాయ హస్తకళలు, నెత్తిమీద బుట్టపెట్టుకుని అమ్మేవాళ్లకు రూ10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలను అందించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
గర్భిణీ స్త్రీలు, తల్లులు, చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించడంలో భాగంగా 77 మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మిగిలిన చోట్ల సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 1863.11 కోట్లను ఖర్చు చేయనుంది. ప్రతి త్రైమాసిక సంవత్సరానికి సంబందించిన విద్యార్థులు ఫీజు రీఎంబర్స్ మెంటు ను నేరుగా తల్లుల ఖాతాలోనే జమ చేయనున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందించడానికి 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏపీ ఫైబర్ నెట్, చంద్రన్నకానుక, రంజాన్ తోఫా పథకాల్లో జరిగిన అవినీతికి సంబందించి సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై మరింతలోతుగా దర్యాప్తు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై సీబీఐ ఎంక్వైరీ కి ప్రభుత్వం ఆదేశించాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని బాద్యులను త్వరలోనే గుర్తిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు.