దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం అనేక రాష్ట్రాలు ఆర్టీ- పీసీఆర్ పద్దతిని అవలంబిస్తున్నాయి. అంటే వ్యక్తుల నుండి సేకరించిన శాంపిళ్ళలో కరోనా ఉనికిని గుర్తించడం అన్నమాట. దీనినే యాంటిజెన్ పరీక్షగా చెప్తారు. లక్షణాలు లేకపోయినా ఇది వైరస్ ను గుర్తించగలదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ యాంటీబాడీస్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం యాంటీ బాడీస్ టెస్టులను నిర్వహించవద్దని ఐసీఎంఆర్ ఇదివరకే ప్రకటన చేసింది.
మనుషుల్లో రోగ నిరోధక శక్తి ఎంత ఉందో తెలుసుకోవడానికే యాంటీ బాడీ టెస్టులని తెలిపింది. మరి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించడానికి ఎందుకు ఆసక్తి చూపుతుంది అనే సందేహం వ్యక్తమవుతుంది. భారత్ లో కరోనా ఇప్పటికే 198 రకాలుగా రూపాంతరం చెందినట్టుగా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) పరిశోధకులు వెల్లడించారు. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జూన్ నాటికి ఈ వైరస్ 55 రకాలుగా రూపాంతరం చెందిందని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది జనాభాకు కరోనా వచ్చి వెళ్లిన ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఒక హైదరాబాద్ నగరంలోనే 6 లక్షల మంది కరోనా భారిన పడ్డారని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
అంటే నగర జనాభాలో 6 శాతం మందికి వైరస్ సోకింది. కానీ వీరిలో లక్షణాలు లేని వారే అధికంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం తెలంగాణాలో నమోదైన కరోనా కేసులు 95,700 మాత్రమే. చాలా మందికి ఇప్పటికే కరోనా వచ్చి ఎలాంటి వైద్యం అవసరం లేకుండానే వెళ్ళిపోయింది. ఈ సమయంలో యాంటీ బాడీస్ టెస్టులను చేయడం ద్వారా ప్లాస్మా దాతలను కనుగొనవచ్చు. వారి ద్వారా కరోనా బాధితులకు చికిత్స చేయడం ద్వారా కరోనాను పూర్తిగా నియంత్రించవచ్చు. శరీరంలోకి ఏదైనా విషం చేరినా, కరోనా లాంటి వైరస్, బాక్టీరియా ప్రవేశించినా మన శరీరం 14 రోజుల వ్యవధిలో యాంటీబాడీలను విడుదల చేస్తుంది. వీటిలో మరో రకం యాంటీబాడీస్ మాత్రం ఇన్పెక్షన్ సోకిన 7 రోజులకు ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీస్ పరీక్షలో పాజిటివ్ గా తేలితే ఆ వ్యక్తికి 15 నుంచి 21 కరోనా వచ్చి వెళ్లినట్టుగా గుర్తిస్తారు. ఇవి శరీరంలో ఉంటె అతనికి మళ్ళీ కరోనా సోకె అవకాశాలు పెద్దగా ఉండవు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల ఇప్పటికే ఈ వైరస్ ఎంత మందికి వచ్చి వెళ్లిందో గుర్తిస్తారు. ఇంకా ఎంత మందికి ఈ వైరస్ సోకె ప్రమాదం ఉందొ తేలికగా కనిపెట్టవచ్చు. ఒకవేళ యంటీబాడీస్ వృద్ధి శాతం అధిక జనాభాలో కనిపిస్తే హెర్డ్ ఇమ్మ్యూనిటీ మొదలవుతుంది. అప్పుడు ఇక ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేయలేదు. వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో యాంటీబాడీస్ టెస్టుల కోసం ఇప్పటికే 25 వేల టెస్టు కిట్లను అందుబాటులో ఉంచారు. మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ పరీక్షలు నిర్వహించి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా టెస్టులు జరపనున్నారు. వీటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. చిన్న చిన్న డిస్పోసబుల్ కిట్లను ఉపయోగించి ఇంటివద్దనే పరీక్షలు నిర్వహించవచ్చు.