అల్లుఅర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’ సినిమాకు సంబందించిన టీజర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించి దూసుకుపోతుంది. ఇదిలా ఉంటె ఇప్పుడు పుష్ప సినిమాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి.
ఈ సినిమా టీజర్ కొత్త కాంట్రవర్సీకి తెర లేపింది. పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే టీజర్ విడుదల కాగానే బన్నీ తర్వాత అందరి చూపు దేవీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీదనే పడింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సినిమాకు సగం హైప్ తెచ్చాడంటూ దేవీపై ప్రశంసలు గుప్పించారు నెటిజన్లు. అంతలోనే వీరి ఆనందం ఆవిరైంది.
ఈ టీజర్ లోని కొన్ని మ్యూజిక్ బిట్స్ ను ‘అవెంజర్స్’ సినిమా నుంచి లేపేసాడని కొందరు. కాదు కాదు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన ‘బేబీ’ సినిమా నుంచి కాపీ చేసారంటూ మరికొందరు ట్రోలింగ్ మొదలు పెట్టారు. అందుకు సంబందించిన వీడియో క్లిప్పింగ్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇది దేవీ సొంతంగా అందించినది కాదని కచ్చితంగా కాపీ పేస్ట్ చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ విషయంలో దేవీకి సపోర్ట్ చేస్తున్నారు.
ఏదైనా ఒక సినిమాకు ఇచ్చిన బీజీఎమ్ మరో సినిమాతో మ్యాచ్ కావడం అనేది యాదృచ్చికంగా జరుగుతుంటాయి. కావాలని చేసింది కాదని దేవి ఫాన్స్ చెప్తున్నారు. ఏది ఏమైనా పుష్ప సినిమా కాంట్రవర్సీ హాట్ టాపిక్ గా మారింది. బన్నీ ఫాన్స్ కు మాత్రం ఈ వివాదం తలనొప్పిగా మారింది. తమ హీరో సినిమాకు ఇలా జరుగుతుండటంతో దేవిపై ఫాన్స్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వివాదంపై దేవి శ్రీ ప్రసాద్ గాని పుష్ప టీమ్ గాని ఇప్పటివరకు స్పందించలేదు. ఇక మైత్రి మూవీ బ్యానర్స్ పై వస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 13 న విడుదలకు సిద్దమవుతుంది.