ఘట్కేసర్ శివారు ప్రాంతంలో బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనలో అనేక అనుమానాలు తలెతుతున్నాయి. యువతిపై లైంగిక దాడి జరిగిందా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. విద్యార్థిని ఆసుపత్రికి చేర్చే సమయంలో ఆమె అపస్మారక స్థితిలో ఉంది. నిందితులు విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో ఆమె ఒంటిపై పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి.
కుడి కాలుపై గాయం ఉంది. విద్యార్థిని భయపడుతుండటం వల్ల ఆ సమయంలో ఎక్కువగా మాట్లాడలేకపోయింది. ఇంటర్నల్ గా ఆమెకు శరీరంలో కొన్ని గాయాలను గుర్తించారు. అయితే లైంగిక దాడి జరిగిందా లేదా అనే విషయాన్నీ ఇప్పుడే నిర్దారించలేమని క్యూర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఓ కళాశాలలో విద్యార్థిని బీ ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతుంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నాగారం వరకు కాలేజీ బస్సులో వచ్చి అక్కడ ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ సమయంలో యువతితో అటుగా ఆమె కాలేజీలో చదివే ఒక సీనియర్ ఇంకో మహిళా ఉన్నారు. కొంత దూరం వెళ్ళగానే వారిద్దరూ దిగిపోయారు. ఆ తర్వాత యువతి దిగాల్సిన స్టాప్ రాగానే అక్కడ ఆగకుండా డ్రైవర్ వేగంగా ముందుకు పోనిచ్చాడు.
మార్గమధ్యంలో మరో ఇద్దరికీ ఫోన్ చేసి పిలిపించాడు. తనను ఆటోలో ఎటుకెళ్తున్నారని విద్యార్థిని ఫోన్ చేసి తల్లికి సమాచారం అందించింది. 100 కు డయల్ చేయడంతో ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థిని సెల్ ఫోన్ ఆధారంగా లొకేషన్ ను గుర్తించారు. కీసర, ఘట్కేసర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విద్యార్థిని ఆచూకీని గుర్తించారు.